Bhoodan Land Case: భూదాన్ భూముల కేసులో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. వాదనలు సింగిల్ బెంచ్లోనే వినిపించాలంటూ సీనియర్ ఐపీఎస్ సహా పలువురు ఉన్నతాధికారులకు షాక్ ఇచ్చింది.
Bhoodan Land Case: తెలంగాణ హైకోర్టులో భూదాన్ భూముల కేసు కీలక మలుపు తిరిగింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే కోరుతూ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులైన మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రాలు దాఖలు చేసిన పిటిషన్ను ధర్మాసనం తిరస్కరించింది. ఈ కేసు తదుపరి విచారణ కూడా సింగిల్ బెంచ్ సమక్షంలోనే జరగాలంటూ న్యాయవాదులను హైకోర్టు ఆదేశించింది.
భూదాన్ భూముల కేసులో ఐపీఎస్లకు షాక్
ఐపీఎస్ లతో పాటు పలువురు ఉన్నతాధికారులకు చెందిన భూదాన్ భూములను ఏప్రిల్ 27 నుంచి నిషేధిత జాబితాలో పెట్టాలని ఈనెల 24న హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 24న న్యాయమూర్తి జస్టిస్ సీ.వి. భాస్కర్ రెడ్డి ఇచ్చిన కీలక ఉత్తర్వుల ప్రకారం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్లు 181, 182, 194, 195లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని జిల్లా కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు.
భూదాన్ భూముల: ఉత్తర్వులను సవాలు చేసిన ఐపీఎస్ లు
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ముగ్గురు ఐఏఎస్ అధికారులు హైకోర్టులో పిటిషన్ వేశారు. వారిలో మహేష్ భగవత్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా సహా పలువురు సీనియన్ ఉన్నతాధికారులు ఉన్నారు. వారి తరఫు న్యాయవాదులు, మోజు భూములు పట్టా భూములేనని వాదించారు. అయితే, వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది.
భూదాన్ భూముల వివాదం: పలువురు అధికారులు కలిసి నకిలీ పత్రాలలో రిజిస్ట్రేషన్లు?
ఈ కేసులో బిర్ల మల్లేశ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అభియోగాల ప్రకారం.. రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి నకిలీ పత్రాలు తయారు చేసి, భూదాన్ భూములను చట్టవిరుద్ధంగా ఇతరుల పేర్లకు బదలాయించారని పేర్కొన్నారు. బినామీ లావాదేవీలతో చట్టవిరుద్ధంగా భూదాన్భూములను బదలాయించారని ఆరోపించారు. భూదాన్ చట్ట, తెలంగాణ భూదాన, గ్రామదాన నిబంధనలు-1965కు విరుద్ధంగా పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లు సొంత పేర్లతో పాటు కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మహేశ్వరం మండలం నాగారం గ్రామం సర్వే నంబర్ 181, 182, 194. 195లోని భూదాన్ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు.
