TGSRTC: బస్ టికెట్, బస్ పాస్ అన్నీ స్మార్ట్ఫోన్లోనే.. ఆర్టీసీ కీలక నిర్ణయం
ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త సేవలను తీసుకొస్తున్న తెలంగాణ ఆర్టీసీ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకీ ఏంటా నిర్ణయం.? దీంతో ప్రయాణికులకు జరిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇకపై వాట్సాప్లోనే బస్సు టికెట్లు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు మరింత సులభతరమైన సేవల్ని అందించేందుకు వాట్సాప్ టికెట్ బుకింగ్ను ప్రవేశపెడుతోంది. త్వరలోనే ప్రయాణికులు తమ ప్రయాణ వివరాలను వాట్సాప్లో ఎంటర్ చేసి, వెంటనే ఇ-టికెట్ పొందే అవకాశం రానుంది. దీనిని ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (AFCS) కింద అమలవుతుంది. ఈ విధానం ద్వారా వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, మరింత వేగంగా టికెట్ పొందొచ్చు.
బస్ పాసులు కూడా స్మార్ట్ ఫోన్లోనే
తెలంగాణ ఆర్టీసీ కొత్తగా డిజిటల్ బస్ పాస్లను ప్రవేశపెడుతోంది. ఈ పాస్లు RTC మొబైల్ యాప్ ద్వారా జారీ చేస్తారు. పాస్ను కనడక్టర్లు హ్యాండ్హెల్డ్ టికెటింగ్ మెషిన్ ద్వారా స్కాన్ చేసి ధృవీకరిస్తారు. రానున్న రోజుల్లో పేపర్ పాస్లు పూర్తిగా కనుమరుగు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇది ప్రయాణికులకు సౌలభ్యం కలిగించడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.
20 శాతం మంది ఇప్పటికే డిజిటల్ టికెట్లవైపు
AFCS పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే హైదరాబాద్లో రోజూ 20 శాతం ప్రయాణికులు డిజిటల్ టికెట్లు వాడుతున్నారు. ముషీరాబాద్ డిపోను సందర్శించిన రవాణా, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వివరాలను వెల్లడించారు. AFCS పని తీరును సమీక్షించిన మంత్రి, కనడక్టర్లతో మాట్లాడి ఈ టెక్నాలజీ వాడటంలో ఎదురవుతున్న అనుభవాలు తెలుసుకున్నారు. త్వరలో ఈ సిస్టంను అన్ని బస్సులకు విస్తరించనున్నట్టు తెలిపారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు లబ్ధి
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మహాలక్ష్మి పథకం గురించి ప్రస్తావించారు. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. ఇప్పటి వరకూ 191 కోట్ల టికెట్లు ఉచితంగా జారీ చేయగా, దాదాపు రూ.6,300 కోట్లు మహిళలు ఆదా చేసుకున్నారని తెలిపారు. ఈ పథకానికి దేశవ్యాప్తంగా ప్రశసంలు లభిస్తున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు.
ORR లోపల ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణ ఆర్టీసీ నగరంలో పర్యావరణ అనుకూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ముషీరాబాద్ డిపోలో చెట్లు నాటి గ్రీన్ ఇనిషియేటివ్కు నాంది పలికిన మంత్రి, ORR (ఔటర్ రింగ్ రోడ్) పరిధిలో ఇకపై ఎలక్ట్రిక్ బస్సులే నడపనున్నట్టు తెలిపారు. అలాగే కొత్తగా అభివృద్ధి అయిన కాలనీలకు బస్సు సర్వీసులు విస్తరిస్తామని వెల్లడించారు. ప్రజలు కొత్త రూట్ల కోసం సూచనలు చేయవచ్చని, వాటిని పరిశీలించి అమలు చేస్తామన్నారు.