Telangana Jobs : కేవలం 17 నెలల్లో లక్ష ఉద్యోగాలు..: తెలంగాణ సీఎం కీలక ప్రకటన
తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే భారీగా నిధులు తెచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో భారీగా యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లోనే ఎన్ని ఉద్యోగాలు కల్పించారంటా తెలుసా?

Telangana Jobs
Telangana : తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఫలితంగా రాష్ట్ర యువతకు లక్షకు పైగా ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లభించాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు అంటే కేవలం 17 నెలల్లో ఈ విజయాన్ని సాధించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
Telangana Chief Minister A Revanth Reddy
సోమవారం నానక్రామ్గూడలోని సోనాటా సాఫ్ట్వేర్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యాపార అనుకూల విధానాలు, అంతర్జాతీయ వినియోగదారుల చొరవలే పెట్టుబడులు భారీగా రావడానికి కారణమని చెప్పారు.
"రూ.1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలంటే అందరి సహకారం అవసరం. హైదరాబాద్ను ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలి. ఇందుకోసం ప్రతి తెలంగాణ ప్రజలంతా బ్రాండ్ అంబాసడర్ లా వ్యవహరించాలి" అని సీఎం రేవంత్ సూచించారు.
revanth reddy
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) కోసం దావోస్కి, అలాగే అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలకు వెళ్లినప్పుడు పెట్టుబడిదారులకు తెలంగాణ వ్యాపార హిత రాష్ట్రంగా రుజువైనట్లు రేవంత్ అన్నారు. దావోస్ సమ్మిట్లోనే రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఖరారైనట్లు తెలిపారు.
హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో గ్లోబల్ హబ్గా మారుతోందని చెప్పారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, విప్రో వంటి సంస్థలు హైదరాబాద్లో తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్లు వివరించారు.
Hyderabad
భద్రతా పరంగా కూడా తెలంగాణ దేశంలో నెంబర్ వన్గా ఉందని, ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో ఇది స్పష్టమైందని సీఎం రేవంత్ తెలిపారు. ద్రవ్యోల్బణ నియంత్రణ, ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగ కల్పన, పన్నుల వసూళ్లలోనూ రాష్ట్రం ముందుందని చెప్పారు.
అంతేకాక మహిళల కోసం స్వయం సహాయక గ్రూపుల ద్వారా దేశంలో అతిపెద్ద స్టార్టప్ ఫండింగ్, మెంటరింగ్ కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. 66 లక్షల మహిళలకు ఇది మేలు చేస్తోందని తెలిపారు. యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకం కింద ఫండింగ్, మార్గదర్శనం కల్పిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంలో స్వచ్ఛందంగా పని చేయడానికి ట్రాన్స్జెండర్లను నియమించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు.
Miss Wolrd 2025
ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోనూ భారీ ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్న సీఎం రేవంత్ రెడ్డి... ఏపీ సముద్ర తీరానికి డై పోర్టు, ప్రత్యేక రోడ్డు, రైలు కారిడార్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే హైదరాబాద్లో "ఫ్యూచర్ సిటీ" నిర్మాణం జరుగుతోందని, ఇందులో AI ఆధారిత నగర నిర్మాణం, యువ భారత్ స్కిల్స్ యూనివర్సిటీ, యువ భారత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉంటాయని తెలిపారు. మిస్ వరల్డ్ పోటీలు నగరానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయని, ఇటువంటి అంతర్జాతీయ ఈవెంట్లు మరిన్ని హైదరాబాద్ వేదికగా జరుగుతాయని సీఎం వెల్లడించారు.