OYO: గంట సమయానికి ఓయో రూమ్స్ ఎందుకు, ఏం చేస్తారు.? అసెంబ్లీని కుదిపేసిన అంశం
ప్రముఖ హోటల్ చైన్ సంస్థ ఓయోకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే. యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఎత్తుగడలతో ముందుకెళ్తున్న ఓయో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

అసెంబ్లీలో ఓయో అంశం
మహారాష్ట్రలో ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో హాట్హాట్గా సాగాయి. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు విభిన్న అంశాలను లేవనెత్తాయి. భాషా వివాదం, రైతుల ఆత్మహత్యలు, రుణమాఫీ తదితర సమస్యలపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సుధీర్ మునగంటివార్ ఓయో హోటల్స్ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం సంచలనంగా మారింది.
నగరానికి దూరంగా ఎందుకు.?
ఓయో హోటల్స్ మహారాష్ట్రలో విస్తరిస్తున్నాయన్న సుధీర్.. నగరాల నుంచి 20 కిలోమీటర్ల దూరంలో, నిశ్శబ్ద ప్రాంతాల్లో ఈ హోటల్స్ ఎందుకు ఉన్నాయో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. "ఈ హోటల్స్కు గ్రామ పంచాయితీ, నగరపాలక సంస్థల అనుమతులు లేకుండా ఎలా నడుస్తున్నాయి? దీనికి ఎలా అనుమతులు ఇస్తున్నారని అడిగారు.
ఒక గంటకు రూమ్ ఎందుకు.?
సుధీర్ మునగంటివార్ మాట్లాడుతూ, "ఓయో హోటల్స్లో ఒక గంట పాటు రూమ్ను అద్దెకు ఇస్తున్నారు. దీనిని పోలీస్ శాఖ పరిశీలించాల్సి ఉంది. నగరం నుంచి 20 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లి గది అద్దె తీసుకోవాల్సిన అవసరం ఏముంది.? ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఆ రూమ్స్కి ఎవరు వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు?" అని అనుమానాలు వ్యక్తం చేశారు.
దర్యాప్తు చేపట్టాలి.
ఇలాంటి హోటల్స్ మన సంస్కృతికి మచ్చగా మారుతున్నాయన్న ఎమ్మెల్యే. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఓయో హోటల్స్పై దర్యాప్తు జరిపించాలన్నారు. రాష్ట్రంలో ఇవి ఎంతమేరకు విస్తరించాయో వివరాలు వెల్లడించాలి అని మునగంటివార్ డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం
సుధీర్ మునగంటివార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓయో హోటల్స్ వాడకంపై, వాటి నిబంధనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాకపోయినా, వచ్చే రోజుల్లో హోం శాఖ దీనిపై స్పందించే అవకాశం ఉంది. అయితే ఇది కేవలం మహారాష్ట్రాకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎలాంటి మార్పులకు తెర తీస్తుందో చూడాలి.