Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Income Tax : 60 ఏళ్ల పాత ఆదాయపు పన్ను నిబంధనల స్థానంలో కేంద్రం కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ను తీసుకురానుంది. ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్న ఈ మార్పుల వల్ల పన్ను విధానం మరింత సులభతరం కానుంది.

Income Tax : 60 ఏళ్ల పాత రూల్స్ అవుట్.. కొత్త ఐటీ చట్టం వచ్చేసింది
భారతదేశ ప్రత్యక్ష పన్నుల చరిత్రలో అతిపెద్ద మార్పుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా ఉన్న సంక్లిష్టమైన పన్ను నిబంధనలను పక్కన పెట్టి, సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 ను తీసుకువస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026-27 ప్రసంగంలో ఇప్పటికే ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ముసాయిదాను ఆదాయపు పన్ను శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి వస్తాయి.
60 ఏళ్ల పాత వ్యవస్థకు స్వస్తి.. నిబంధనల తగ్గింపు
ప్రస్తుతం అమలులో ఉన్న 1962 నాటి ఆదాయపు పన్ను నిబంధనలు కాలం చెల్లినవిగా ప్రభుత్వం భావిస్తోంది. గత ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న 511 నిబంధనలను భారీగా తగ్గించి, కేవలం 323 నిబంధనలకు కుదించారు. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు వ్యవస్థ పట్ల అవగాహన పెరుగుతుంది. చట్టపరమైన చిక్కులు, వివాదాలు తగ్గుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ ముసాయిదాపై పన్ను నిపుణులు, సామాన్యులు ఫిబ్రవరి 22 వరకు తమ అభిప్రాయాలను, ఫీడ్బ్యాక్ను తెలియజేయవచ్చు.
కొత్త పన్ను చట్టం : సాంకేతికతతో కూడిన స్మార్ట్ ఫారమ్లు
కొత్త చట్టంలో పన్ను దాఖలు ప్రక్రియను మరింత ఆధునీకరించారు. ఐటీఆర్ (ITR) ఫారమ్లను స్మార్ట్ డిజైన్ ఫీచర్లతో రూపొందించారు. వీటిలో ఆటోమేటెడ్ రికన్సిలియేషన్, ముందే నింపిన (Pre-fill) సమాచారం వంటి సదుపాయాలు ఉంటాయి. దీనివల్ల పన్ను దాఖలు చేసే సమయంలో తప్పిదాలు తగ్గుతాయి. సామాన్య పౌరులు కూడా ఎవరి సహాయం లేకుండానే సులభంగా తమ ట్యాక్స్ రిటర్నులను ఫైల్ చేసేలా ఫారమ్లను సరళతరం చేశారు.
టీసీఎస్ రేట్లలో మార్పులు
బడ్జెట్లో కొన్ని రకాల వస్తువులపై టీసీఎస్ రేట్లను తగ్గించారు. స్క్రాప్, మినరల్స్, ఆల్కహాలిక్ లిక్కర్ విక్రేతలపై టీసీఎస్ రేటును 2 శాతానికి మార్చారు. ముఖ్యంగా లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) కింద విదేశాలకు పంపే నిధులపై మార్పులు చేశారు. 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ నిధులు పంపే సందర్భంలో విద్య, వైద్య చికిత్స కోసం పంపే నిధులపై టీసీఎస్ 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించారు. ఇతర అవసరాల కోసం పంపే నిధులపై 20 శాతం టీసీఎస్ వర్తిస్తుంది.
షేర్ బైబ్యాక్, ఎస్టీటీ లో మార్పులు
కంపెనీల ప్రమోటర్లు బైబ్యాక్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై షేర్ల బైబ్యాక్ను అన్ని రకాల షేర్ హోల్డర్లకు క్యాపిటల్ గెయిన్స్ గా పరిగణించి పన్ను విధిస్తారు. కార్పొరేట్ ప్రమోటర్లకు ఎఫెక్టివ్ ట్యాక్స్ 22 శాతంగా, నాన్-కార్పొరేట్ ప్రమోటర్లకు 30 శాతంగా ఉంటుంది. అలాగే, సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (STT) కూడా పెరిగింది. ఫ్యూచర్స్ పై ఎస్టీటీని 0.02% నుండి 0.05%కి, ఆప్షన్స్ ప్రీమియంపై 0.1% నుండి 0.15%కి పెంచారు.
కార్పొరేట్ పన్నులు, మ్యాట్ విధానం
కార్పొరేట్ సంస్థలను కొత్త పన్ను విధానంలోకి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ (MAT) క్రెడిట్ సెట్-ఆఫ్ సౌకర్యాన్ని కేవలం కొత్త పన్ను విధానంలో ఉన్న కంపెనీలకు మాత్రమే అనుమతిస్తారు. ఏప్రిల్ 1, 2026 నుండి మ్యాట్ను ఫైనల్ ట్యాక్స్ గా మారుస్తారు. దీని రేటును ప్రస్తుతం ఉన్న 15 శాతం నుండి 14 శాతానికి తగ్గించారు. మార్చి 31, 2026 వరకు పేరుకుపోయిన పాత మ్యాట్ క్రెడిట్ను నిర్దేశిత నిబంధనల ప్రకారం వాడుకోవచ్చు.

