- Home
- Entertainment
- Allu Arjun ఫోటో వాడుతున్నారా..? తేడా వస్తే ఇక జైలుకే.. ఐకాన్ స్టార్ విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే?
Allu Arjun ఫోటో వాడుతున్నారా..? తేడా వస్తే ఇక జైలుకే.. ఐకాన్ స్టార్ విషయంలో కోర్టు ఏం చెప్పిందంటే?
పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన క్రేజ్ ఇండియా అంతటా పాకడంతో.. కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే తన పేరు, ఫోటోలు, వాయిస్, వీడియోలు మిస్ యూస్ అవ్వకుండా బన్ని ఏం చేశాడంటే.

పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్..
పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈసినిమా తరువాత ఆయన క్రేజ్ మామూలుగా పెరగలేదు. ఇండియా అంతటా బన్నికి భారీగా అభిమానులు తయారయ్యారు. అల్లు అర్జున్ ఫేమస్ అవ్వడంతో.. ఆయన ఫోటోలు, వీడియలు సోషల్ మీడియాలో విచ్చల విడిగా పోస్ట్ అవుతున్నాయి. నచ్చినట్టుగా నెటిజన్లు బన్నీని వాడేస్తున్నారు. ఈక్రమంలో కొన్ని ఫేక్ ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతుండటంతో.. అల్లు అర్జున్ ఈవిషయంలో కోర్టును ఆశ్రయించారు. తన సమస్యను కోర్టుకు విన్నవించుకున్నారు. దాంతో తాజాగా కోర్టులో ఆయనకు ఊరట లభించింది.
ఐకాన్ స్టార్ కు కోర్టులో ఊరట..
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఢిల్లీ హైకోర్టు లో కీలక ఊరట లభించింది. ఆయన పేరు, ఫొటో, వాయిస్ తో పాటు ఇతర వ్యక్తిగత గుర్తింపులను ముందస్తు అనుమతి లేకుండా కమర్షియల్ అవసరాలకు వినియోగించడంపై న్యాయస్థానం నిషేధం విధించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్ఫేక్ టెక్నాలజీల ద్వారా ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని తెలియచేసింది.
బన్ని ప్రతిష్ఠను దెబ్బతీసేలా కంటెంట్
అల్లు అర్జున్ తరఫున దాఖలైన పిటిషన్లో, కొన్ని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లు , వెబ్సైట్లు ఆయన ఫొటోలు, ఇమేజ్ను అనధికారికంగా ఉపయోగించి వస్తువులను విక్రయిస్తున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా, ఏఐ టూల్స్ ద్వారా ఆయన వాయిస్ను క్లోన్ చేసి ఫేక్ కాల్స్ సృష్టించడం జరుగుతోందని, బన్ని ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసభ్యకర కంటెంట్ను ఆన్లైన్లో ప్రచారం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
అల్లు అర్జున్ పై కోర్టు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఈ అంశాలపై విచారణ జరిపిన జస్టిస్ తుషార్ రావు గెడెల నేతృత్వంలోని సింగిల్ జడ్జి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా కోర్టు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బాలనటుడిగా విజేత సినిమాలో ప్రారంభమైన అల్లు అర్జున్ ప్రయాణం, పుష్ప సిరీస్తో జాతీయ స్థాయికి ఎదిగిందని, ఆయన ఒక కమర్షియల్ సక్సెస్ సాధించిన గౌరవప్రదమైన నటుడని ధర్మాసనం అభిప్రాయపడింది. అల్లు అర్జున్ పేరు, రూపం, వాయిస్, డైలాగ్ డెలివరీ, సిగ్నేచర్ స్టైల్ ఇవన్నీ ఆయనకు ప్రత్యేకమైన వ్యక్తిత్వ హక్కుల పరిధిలోకి వస్తాయి. వీటిని అనుమతి లేకుండా వినియోగించడం వల్ల ఆయనకు నష్టం కలుగుతుందని కోర్టు పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ప్రముఖులు..
ఈ నేపథ్యంలో, ఆయన గుర్తింపును ఉపయోగించి ఏఐ ఆధారిత డీప్ఫేక్ వీడియోలు, ఫేస్ మార్ఫింగ్ కంటెంట్ సృష్టించడాన్ని నిషేధించింది. అలాగే ఆయన ఫొటోలతో దుస్తులు, పోస్టర్లు వంటి వస్తువులను విక్రయించకూడదని ఆదేశించింది. అభ్యంతరకరమైన కంటెంట్ కలిగిన లింకులు, వెబ్సైట్లను 72 గంటల్లోగా తొలగించాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణలను జులై 14 , సెప్టెంబర్ 24 తేదీలకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో తమ వ్యక్తిత్వ హక్కులను కాపాడుకునేందుకు పలువురు ప్రముఖులు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వారిలో పవన్ కళ్యాణ్, నాగార్జున, కాజోల్, ఐశ్వర్య రాయ్, చిరంజీవి, వంటి సెలబ్రిటీలు ఉన్నారు.

