Gold Price: చుక్కలు చూపిస్తున్న బంగారం.. మళ్లీ రూ. లక్ష ఎందుకు దాటిందో తెలుసా.?
బంగారం ధర మళ్లీ చుక్కలు చూపిస్తుంది. గోల్డ్ ప్రైస్ గత కొన్ని రోజులుగా క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయితే తాజాగా మరోసారి తులం బంగారం ధర లక్ష దాటేసింది. ఇంతకీ బంగారం ధర మళ్లీ పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

దూకుడు మీదున్న గోల్డ్
బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయని అంతా సంతోషిస్తున్న తరుణంలో మరోసారి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,00,210కి చేరింది. ఇక వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ. 1,08,700కు పెరిగింది. బంగారం ధరలో ఈ పెరుగుదలకు పలు అంతర్జాతీయ, ఆర్థిక మార్పులు కారణంగా చెబుతున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ధరల్లో లాభం
MCX (Multi Commodity Exchange)లో గురువారం ట్రేడింగ్ సమయంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 97,650గా నమోదైంది. ఇది గత సెషన్ ముగింపు ధర రూ. 96,704తో పోలిస్తే సుమారు 0.97% పెరుగుదల. అంతర్జాతీయంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర 0.6% పెరిగి $3,372.46కి చేరింది. US Gold ఫ్యూచర్స్లో కూడా ధర 1.5% పెరిగినట్టు సమాచారం.
బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాలు
డాలర్ విలువ పడిపోతుండటం
అమెరికా డాలర్ బలహీనపడటం ప్రధాన కారణాల్లో ఒకటి. రెండునెలల కనిష్ఠానికి డాలర్ పడిపోవడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. డాలర్ క్షీణతతో బంగారం లాభదాయకమైన పెట్టుబడిగా మారుతోంది.
మధ్యప్రాచ్యంలో పెరిగిన ఉద్రిక్తతలు
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు, మిగతా గల్ఫ్ దేశాల్లో నెలకొన్న అనిశ్చితి వాతావరణం బంగారంపై డిమాండ్ పెరగడానికి కారణమైంది. భద్రతల రీత్యా మదుపరులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణిస్తున్నారు.
కేంద్ర బ్యాంకుల బంగారంపై ఆసక్తి
బంగారం ప్రస్తుతం గ్లోబల్ మదుపరులకు మాత్రమే కాదు, కేంద్ర బ్యాంకులకు కూడా ప్రధాన రిజర్వ్ ఆస్తిగా మారుతోంది. వారు బంగారం కొనుగోళ్లను పెంచడంతో మొత్తం డిమాండ్ పెరిగింది.
అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందాల అస్పష్టత
గ్లోబల్ మార్కెట్లో అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందాలపై స్పష్టత లేకపోవడం, మార్కెట్లో అనిశ్చితిని పెంచింది. దీని ప్రభావం బంగారం డిమాండ్పై పడింది.
పెట్టుబడి పెట్టొచ్చా.?
ఇప్పటివరకు బంగారం పెట్టుబడి పరంగా నష్టాన్ని ఇవ్వలేదు. తక్కువ రిస్క్, గ్యారంటీ రిటర్న్స్ కోరుకునే వారు దీన్ని సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు. అయితే, ధరలు ఇప్పటికే గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో కొనుగోలుపై కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఇంతకు మించి ధరలు పెరిగే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.