Weather : మండే ఎండలు.. మరోవైపు వానలు ! తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు
Telangana weather: తెలంగాణలో మే నెల మొత్తం తీవ్రమైన వేడిగాలులు, మండే ఎండలతో పాటు పిడుగుతో కూడిన వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 13 జిల్లాల్లో రాబోయే కొన్ని వారాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. అలాగే, హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

Telangana weather alerts: తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు వానలు దంచికొడుతున్నాయి. విచిత్రమైన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో తీవ్ర ఎండలు, వేడిగాలులు వీచడంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది.
వేడిగాలులు, పెరుగుతున్న ఎండలు, వడగళ్ల వర్షాల వాతావరణం క్రమంలో తెలంగాణకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో వేసవి తీవ్రత అధికంగా ఉంటుందనీ, రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తీవ్ర ఉష్ణతరంగాలు కొనసాగుతాయంటూనే, వడగళ్లతో కూడిన పిడుగు వర్షాలు కూడా మే 6 వరకు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
తీవ్ర ఎండలు, వేడిగాలులు హెచ్చరికలు
గత 11 సంవత్సరాల విపత్తు నిర్వహణ గణాంకాల ప్రకారం.. అదిలాబాద్, నిర్మల్, జగిత్యాల్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ జిల్లాల్లో ఉష్ణతరంగాలు సంవత్సరానికి సగటున 21–40 రోజులు ఉంటాయి. రాబోయే రోజుల్లో ఈ జిల్లాల్లో వేడిగాలులు, ఎండలు అధికంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఎండలతో వీళ్లు జాగ్రత్త
వేడిగాలులు, పెరుగుతున్న ఎండల మధ్య అధికారులు తమ హెచ్చరికల్లో పలు సూచనలు చేశారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, ప్రసూతి మహిళలు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఉన్నవారు, కార్మికులు అంటే రోడ్డు పనివారు, కూలీలు, ట్రాఫిక్ పోలీసులు మొదలైన వారు ఎండల ప్రభావానికి గురయ్యే అవకాశముందని తెలిపారు. వీరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీరు అధిక వేడి ప్రభావానికి గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రోజంతా నీరు ఎక్కువగా తాగడం, మధ్యాహ్న వేళ (12PM - 4PM) బయటికి పోకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
మే నెలలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C వరకు ఉంటాయి
మే నెలలో తెలంగాణలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 41°C నుండి 44°C వరకు నమోదవుతాయని పేర్కొంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిత్యం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ 39.5°C, అదిలాబాద్ 34°C, నిజామాబాద్ 32°C, ఖమ్మం 28°C, మెదక్ 31°C, హన్మకొండ 37°C, రామగుండం 38°C పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
హైదరాబాద్లో ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం
ఈ వారంలో సాయంత్రం సమయంలో హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసింది. కూకట్పల్లి, మియాపూర్, హైటెక్సిటీ, అమీర్పేట, బొరబండ, గచ్చిబౌలి, మెహదీపట్నం, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం తాత్కాలికంగా వేడి తగ్గించిందని ఐఎండీ అధికారులు తెలిపారు.
మే 6 వరకు, పలు జిల్లాల్లో 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు, పిడుగులు వచ్చే అవకాశం ఉందని హెచ్చిరించింది. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సిద్ధిపేట తదితర జిల్లాల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.