Free Train: హైదరాబాదీలకు ఉచితంగా రైలు ప్రయాణం.. దెబ్బకు ట్రాఫిక్ సమస్య మాయం
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు కొన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన ప్రభుత్వం ఇకపై రైలులో కూడా ఉచిత ప్రయాణాన్ని అందించేందుకు కసరత్తు చేస్తోంది.

ఉచిత ప్రయాణ పథకం
హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్య సమస్యలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఎక్కువగా ప్రజారవాణా వైపు మొగ్గు చూపేలా చేయడం లక్ష్యంగా ఎంఎంటీఎస్ (MMTS) రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ పథకం అమలుతో నగర జీవనశైలి, రవాణా విధానం రెండింటిలోనూ మార్పులు రావచ్చని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొదట ఇది ప్రయోగాత్మకంగా ఏడాది పాటు అమలు చేయాలని నిర్ణయించారు. ఆ కాలంలో ప్రయాణికుల స్పందన, ఫలితాలను విశ్లేషించి భవిష్యత్తులో కొనసాగింపుపై నిర్ణయం తీసుకోనున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిన తర్వాత అమలు ప్రక్రియ వేగం అందుకుంది. ప్రభుత్వ ఉన్నతాధికారులు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమై పథకం అమలు విధానంపై చర్చించారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ ద్వారా రైల్వేకు వచ్చే సుమారు రూ.10 కోట్ల వార్షిక ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని హామీ ఇచ్చింది.
తగ్గిన ప్రయాణికులను పెంచడమే లక్ష్యం
కోవిడ్ ముందు ఎంఎంటీఎస్ సేవలకు మంచి ఆదరణ ఉండేది. రోజుకు లక్షకు పైగా ప్రయాణికులు ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం రైళ్ల సంఖ్య తగ్గడం, సమయపాలన లోపించడం వల్ల ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు ఉచిత ప్రయాణం అమలుతో మళ్లీ ఎక్కువ మంది ఈ సేవలను వినియోగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సేవల్లో మార్పులు – ప్రయాణికులకు సౌలభ్యం
కేవలం ఉచిత ప్రయాణంతో సరిపెట్టకుండా, సేవలను మెరుగుపరచడంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో అదనపు రైళ్లు నడపడం, సమయానికి రాకపోకలు ఉండేలా చర్యలు తీసుకోవడం, స్టేషన్లలో మౌలిక వసతులు పెంచడం వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుంది. అలాగే ఇంటి నుంచి స్టేషన్ వరకు, స్టేషన్ నుంచి గమ్యస్థానానికి వెళ్లేందుకు ఆర్టీసీ షటిల్ బస్సులను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది.
రైల్వే స్పందన – తదుపరి చర్యలు
ఈ ప్రతిపాదనపై దక్షిణ మధ్య రైల్వే సానుకూలంగా స్పందించింది. పథకం అమలుకు సంబంధించి అవగాహన ఒప్పందం (MoU) ముసాయిదాను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రైల్వే బోర్డు అనుమతుల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అలాగే ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు సంబంధించిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మొత్తానికి ఈ పథకం అమల్లోకి వస్తే హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రజలకు ఆర్థికంగా ఊరట లభించే అవకాశం ఉంది.

