Hyderabad: 72 ఏళ్ల మహిళకు అరుదైన ఆపరేషన్.. సికింద్రాబాద్ వైద్యుల అద్భుతం
Hyderabad: సాధారణంగా 72 ఏళ్ల వయసున్న వారికి గుండె పరీక్షలు చేయాల్సి వస్తే ఓపెన్ హార్ట్ సర్జరీగా చేస్తుంటారు. అయితే సికింద్రాబాద్ వైద్యులు ఓ మహిళకు వాల్వ్ చికిత్స చేసి అద్భుతాన్ని సృష్టించింది.

ఓపెన్ సర్జరీ లేకుండానే గుండె వాల్వ్ సమస్యకు పరిష్కారం
సికింద్రాబాద్లోని మెడికవర్ ఆసుపత్రిలో 72 ఏళ్ల మహిళకు ఛాతీ తెరవకుండానే గుండె వాల్వ్ చికిత్స చేసి వైద్య బృందం మరో మైలురాయి సాధించింది. అధిక వయస్సు కారణంగా సాంప్రదాయ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ ప్రమాదకరంగా మారే పరిస్థితుల్లో ఈ విధానం ఆశాజనకంగా మారింది.
మిట్రల్ వాల్వ్లో లీకేజ్
కొన్ని నెలలుగా ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చిన్నచిన్న పనులకే తీవ్రమైన ఆయాసం, అలసట వంటి సమస్యలు కనిపించాయి. కుటుంబ సభ్యులు ఇవి వయస్సు ప్రభావమని భావించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే పరిస్థితి మరింత దిగజారి గుండె వైఫల్య లక్షణాలతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. పరీక్షల్లో మిట్రల్ వాల్వ్లో తీవ్రమైన లీకేజ్ ఉన్నట్టు తేలింది. వైద్యుల అంచనా ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిలో వాల్వ్ సమస్యలు సాధారణమే అయినా, అవగాహన లోపంతో ఆలస్యంగా గుర్తించే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి.
ఓపెన్ హార్ట్ సర్జరీకి బదులుగా ప్రత్యామ్నాయం
ఆమె వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రమాదకరం అని నిపుణులు భావించారు. దీంతో కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, అనస్తీషియా విభాగాల నిపుణులతో కూడిన హార్ట్ టీమ్ కేసును సమగ్రంగా పరిశీలించింది. రోగి స్థితికి అనుగుణంగా మినిమల్ ఇన్వేసివ్ విధానాన్ని ఎంపిక చేశారు.
కాథెటర్ ద్వారా ఆధునిక చికిత్స
డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి నేతృత్వంలో డా. సాగర్ చంద్రశేఖర్ భుయార్, డా. ఎన్. శివ ప్రసాద్ నాయుడు, డా. అమరేంద్ర కుమార్ సింగ్, డా. పర్వత్రాజ్ వరుణ్ గౌతమ్, డా. సుబ్రహ్మణ్యం కలిసి ప్రత్యేక విధానంతో చికిత్స నిర్వహించారు. కాలి రక్తనాళం ద్వారా సన్నని ట్యూబ్ను గుండె వరకు చేర్చి, ఆధునిక ఇమేజింగ్ పద్ధతుల సహాయంతో వాల్వ్ లీకేజ్ను గణనీయంగా తగ్గించారు. ఈ ప్రక్రియలో ఛాతీ తెరవాల్సిన అవసరం లేకపోవడం, రక్తస్రావం తక్కువగా ఉండడం ప్రధాన ప్రయోజనాలు.
రోగిలో స్పష్టమైన మెరుగుదల
చికిత్స అనంతరం రోగి ఆరోగ్యం స్థిరంగా ఉంది. శ్వాసలో గణనీయమైన మార్పు కనిపించడంతో రోజువారీ పనులను స్వయంగా నిర్వహించగలుగుతున్నారు. డా. ప్రమోద్ కుమార్ కుచులకంటి మాట్లాడుతూ, వృద్ధుల్లో కనిపించే అలసట, శ్వాసకోశ ఇబ్బందులను తేలికగా తీసుకోకూడదన్నారు. ముందస్తు పరీక్షలతో సమస్యను గుర్తిస్తే సురక్షితమైన ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. మెడికవర్ ఆసుపత్రి వర్గాలు ఇలాంటి అత్యాధునిక గుండె చికిత్సలను మరింత మందికి చేరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించాయి.

