Weather : తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు ... ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ(గురువారం) ఉదయమే వర్షం మొదలయ్యింది. ఇక్కడ ఈ రోజంతా వాతావరణం చల్లగానే ఉంటుందని.. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.

Telugu States Weather
Weather : అసలిది ఎండాకాలమా లేక వర్షాకాలమా అన్న పరిస్థితి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. గత రెండుమూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి... దీంతో ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడింది. ఇవాళ(గురువారం) ఉదయమే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం మొదలయ్యింది... కొన్నిప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.
Telangana Rains
రాబోయే ఐదు రోజులపాటు తెలంగాణలో ఇలాగే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో జోరుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈదురుగాలులు, ఉరుములతో పాటు వడగండ వానలు పడే అవకాశాలున్నాయని తెలిపారు.
Hyderabad Rains
ఇక రాజధాని నగరం హైదరాబాద్ తో పాటు చుట్టపక్కల జిల్లాలో కూడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, గద్వాల, పెద్దపల్లి, ములుగు, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్. వరంగల్, హన్మకొండ, సిద్దిపేట జిల్లాల్లో కూడా వర్షసూచనలు ఉన్నట్లు తెలిపారు. ఇలా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశాలున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
andhra pradesh Rains
ఆంధ్ర ప్రదేశ్ వాతావరణం విషయానికి వస్తే ఇక్కడా పలుజిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఎండలు మండిపోయి సాయంత్రం వాతావరణం చల్లబడి వర్షాలు మొదలవుతాయి.
Rains
పశ్చిమ బంగాళాఖాతంలో అండమాన్ దీవుల సమీపంలో బుధవారం ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అల్పపీడనంగా మారిందని... దీని ప్రభావంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ వర్షాలు నాలుగైదురోజులు కొనసాగే అవకాశాలున్నాయట.
ఇక నైరుతి రుతుపవనాలు కూడా ఈసారి కాస్త ముందుగానే తెలుగు రాష్ట్రాలను తాకుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అండమాన్ దీవుల్లో రుతుపవనాలు వ్యాపించాయని... ఇవి ఈ నెలాఖరుకు కేరళ తీరాన్ని తాకే అవకాశాలున్నట్లు తెలిపారు. జూన్ మొదటివారంలో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి వర్షాలు మొదలవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.