- Home
- National
- ప్రతిపక్షాలకు మోదీ, షా మాస్టర్ స్ట్రోక్.? మహిళా రిజర్వేషన్ బిల్లు వీగినా బీజేపీకే లాభమా.?
ప్రతిపక్షాలకు మోదీ, షా మాస్టర్ స్ట్రోక్.? మహిళా రిజర్వేషన్ బిల్లు వీగినా బీజేపీకే లాభమా.?
Amendment bill: 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకపోవడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ బిల్లు చివరకు సంఖ్యాబలం వద్ద నిలిచిపోయింది. ఈ పరిణామం వెనుక రాజకీయ లెక్కలు, వ్యూహాలు, భవిష్యత్ ప్రభావాలు ఏమిటో వివరంగా చూద్దాం.

అసలు ఏంటీ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు?
ఈ బిల్లు ప్రధానంగా మహిళలకు లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలలో 33% రిజర్వేషన్ త్వరగా అమలు చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చింది. ఇప్పటికే 2023లో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ చట్టం (నారీ శక్తి వందన్ చట్టం) అమలుకు డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) అవసరం అని నిబంధన ఉంది. అయితే 131వ సవరణ బిల్లు ద్వారా 2011 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం, 2029 ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్ అమలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్రం ఎందుకు ఈ బిల్లు తీసుకొచ్చింది?
కేంద్ర ప్రభుత్వం ముందుగా మహిళా సాధికారతను వేగంగా అమలు చేయాలనే ఉద్దేశాన్ని ముందుకు తెచ్చింది. మహిళా ఓటర్లపై ప్రభావం చూపేలా రాజకీయంగా కూడా ఇది కీలక నిర్ణయం. వీటితోపాటు మహిళలకు తక్షణ రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం, 2029 ఎన్నికలకు ముందే అమలు చేయాలన్న లక్ష్యం, ఎన్నికల ముందు రాజకీయంగా బలమైన సందేశం ఇవ్వడం లక్ష్యంగా ఎన్డీఏ అడుగులు వేసింది. అయితే ఈ బిల్లులో డీలిమిటేషన్ అంశం కలపడం వల్లే వివాదం పెరిగింది.
బిల్లు ఎలా వీగిపోయింది?
లోక్సభలో ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణగా మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. మొత్తం 528 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నారు. సవరణ బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 230 ఓట్లు పడ్డాయి. అవసరమైన మెజారిటీ 352 కావడంతో బిల్లు వీగిపోయింది. ఈ సంఖ్య దాటకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా బిల్లు ఆమోదం పొందలేదని ప్రకటించారు. విపక్షాలు ఏకమై వ్యతిరేకంగా ఓటేయడం, ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల పార్టీలు (టీడీపీ కాదు) డీలిమిటేషన్పై ఆందోళన చేయడం బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.
అయినా బీజేపీకి లాభమే.?
బిల్లు ఆమోదం పొందకపోయినా రాజకీయంగా ఇది పూర్తిగా నష్టమే అనుకోవడం సరైంది కాదు. ఈ పరిణామం వల్ల మహిళా రిజర్వేషన్కు మద్ధతు ఇస్తున్న పార్టీగా బీజేపీ ఇమేజ్ పెరుగుతుంది. విపక్షాలు మహిళల ఎదుగుదలను అడ్డుకుంటున్నాయనే ప్రచారం చేయవచ్చు. ఎన్నికల సమయంలో భావోద్వేగ అంశంగా దీన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటికే ఈ అంశాన్ని తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
విపక్షాలను ఎలా ఇరుకున పెట్టబోతున్నారు?
ఈ బిల్లును వ్యతిరేకించినందుకు విపక్షాలపై ఇప్పటికే తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. కిరణ్ రిజిజు దీన్ని “చారిత్రక తప్పిదం”గా అభివర్ణించగా, అమిత్ షా “మహిళా బిల్లును ఓడించి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు” అని విమర్శించారు. రానున్న పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఈ బిల్లు అంశాన్ని అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతన్నాయి. అయితే మరోవైపు రాహుల్ గాంధీ మాత్రం ఇది అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు కాదని, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నమని ఆరోపించారు. మరి ఈ బిల్లు వ్యవహారం మహిళా ఓటర్లను ఏమేరకు ప్రభావితం చేస్తుంది.? ఇది బీజేపీకి నిజంగానే కలిసొస్తుందా.? వేచి చూడాలి.

