- Home
- Entertainment
- Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే
Tripuraneni Chittibabu: తీవ్ర విషాదం.. ప్రముఖ నిర్మాత చిట్టిబాబు మృతి, సౌందర్య జాతకం మారింది ఆయన వల్లే
దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణించిన త్రిపురనేని చిట్టిబాబు మరణించారు. గుండెపోటు కారణంగా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చిట్టిబాబు తుదిశ్వాస విడిచారు.

Tripuraneni Chittibabu
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు (71) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించారు. దీనితో ఆయన మరణ వార్తతో టాలీవుడ్ లో దిగ్భ్రాంతి నెలకొంది. త్రిపురనేని చిట్టిబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా రాణించారు.
గుండెపోటు కారణంగా మృతి
బుధవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని సింధు హాస్పిటల్ కి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో చిట్టిబాబు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. చిట్టిబాబు ఫిల్మీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు. చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ఆయన 1955లో కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జన్మించారు.
సౌందర్యని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్
సూపర్ స్టార్ కృష్ణ కెరీర్ లో మెమొరబుల్ గా నిలిచిపోయిన చిత్రం అల్లూరి సీతారామరాజు. ఈ చిత్రానికి రచయిత ఎవరో కాదు చిట్టిబాబు తండ్రి త్రిపురనేని మహారథి. తండ్రి బాటలోనే సినిమారంగంలోకి వచ్చారు చిట్టిబాబు. సౌందర్య లాంటి అగ్ర హీరోయిన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసిన క్రెడిట్ చిట్టిబాబుకే దక్కుతుంది. సౌందర్య తొలిసారి నటించిన రైతు భారతం అనే చిత్రాన్ని చిట్టిబాబు తెరకెక్కించారు. కానీ ఈ సినిమా రిలీజ్ ఆలస్యం కావడంతో ఆ తర్వాత ఆమె నటించిన మనవరాలి పెళ్లి ముందుగా రిలీజ్ అయింది.
30 చిత్రాల్లో నటుడిగా
దీనితో సౌందర్య డెబ్యూ మూవీగా మనవరాలి పెళ్లి నిలిచింది. కానీ ఆమె తొలిసారి కెమెరా ఫేస్ చేసింది మాత్రం చిట్టిబాబు దర్శకత్వంలోనే. ఎమ్మెస్ నారాయణని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేసింది చిట్టిబాబే. చిట్టిబాబు సినీ, రాజకీయ విశ్లేషకుడిగా టీవీ డిబేట్స్ లో సైతం పాల్గొంటూ ఉండేవారు. నిర్మాతగా, దర్శకుడిగా మాత్రమే కాకుండా చిట్టిబాబు దాదాపు 30 చిత్రాల్లో నటుడిగా నటించారు. జాతిరత్నాలు, జిన్నా లాంటి సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన మృతి కుటుంబ సభ్యులు శోకసంద్రం లో మునిగిపోయారు. చిట్టిబాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలుపుతున్నారు.
రాజకీయ రంగంలో కూడా కీలక పాత్ర
సినీ రంగంతో పాటు, చిట్టిబాబు గారు రాజకీయ రంగంలో కూడా కీలక పాత్ర పోషించారు. ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపన నుంచే ఒక ముందడుగు వేసిన నాయకుడిగా, సీనియర్ నాయకుడిగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు. ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు అన్ని వర్గాల నుంచి గౌరవం లభించింది. చిట్టిబాబు గారికి భార్య ఉషా లత గారు, ముగ్గురు సంతానం.. నరోత్తం త్రిపురనేని, భాస్వంత్ త్రిపురనేని, మోనిషా త్రిపురనేని ఉన్నారు. చిట్టిబాబు గారి మరణం సినీ రంగానికి, రాజకీయ వర్గాలకు తీరని లోటు. ఆయన ఒక ప్రతిభావంతుడైన కళాకారుడు, మార్గదర్శి, నిబద్ధత కలిగిన ప్రజా సేవకుడిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు.

