- Home
- Entertainment
- 3700 కోట్ల నష్టం, టాలీవుడ్ కు చెమటలు పట్టించిన దొంగ, పక్కా ప్లాన్ తో పట్టుకున్న పోలీసులు
3700 కోట్ల నష్టం, టాలీవుడ్ కు చెమటలు పట్టించిన దొంగ, పక్కా ప్లాన్ తో పట్టుకున్న పోలీసులు
ఒకే ఒక్క వ్యక్తి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం తీసుకువచ్చాడు, నిర్మాతలకు చెమటలు పట్టించాడు. ఎట్టకేలకు ఆ వ్యక్తిని పక్కా ప్లాన్ తో పట్టుకున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి, ఏంటా కథ.

తెలుగు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న అతి పెద్ద సమస్య పైరసీ. ఈ పైరసీ మాఫియా టాలీవుడ్ పెద్దలకు నిద్రలేకుండా చేస్తోంది. సినిమా కలెక్షన్స్ పై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది. దాంతో ఈ సమస్యపై చాలా కాలంగా పోరాటం జరుగుతుంది. అయితే ఈ పైరసీ మాఫియాను నడిపిస్తున్న కీలక వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.
సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా ప్లాన్ తో అతన్ని పట్టుకున్నారు. సినిమా విడుదల రోజునే ఫుల్ HD వర్షన్ లో సినిమాను పైరసీ చేసి ఆన్లైన్కి అప్లోడ్ చేస్తున్నాడు ఆ నిందితుడు. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా కు చెందిన జన కిరణ్ కుమార్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా లాజ్ చేసిన ఫిర్యాదులో, 2024 సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమకు పైరసీ వల్ల 3700 కోట్ల మేర నష్టం జరిగిందని పేర్కొన్నారు. ఈ మేరకు చేపట్టిన దర్యాప్తులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జన కిరణ్ను అరెస్ట్ చేసి, పలు కీలక వివరాలను వెలుగులోకి తీసుకువచ్చారు.
జన కిరణ్ కుమార్ గత కొంత కాలంగా సినిమా విడుదలైన రోజే వాటి HD వర్షన్లను పైరసీ చేసి వివిధ వెబ్సైట్లకు అమ్ముతున్నాడని విచారణలో వెల్లడైంది. ఆయన ఇప్పటి వరకు దాదాపు 65 సినిమాలను పైరసీ చేసినట్టు పోలీసులు తెలిపారు. చిన్న సినిమాలను 32,000కి, పెద్ద సినిమాలను 80,000కి పైరసీ వెబ్సైట్లకు విక్రయిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో జన కిరణ్పై 1957 కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు గత కొంతకాలంగా పైరసీ సమస్య ఎక్కువయ్యిందని సినీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యంగా సంక్రాంతి 2024లో విడుదలైన "గేమ్ ఛేంజర్" నుంచి తాజాగా "కన్నప్ప" వరకు పలు భారీ సినిమాలు పైరసీ బారిన పడ్డాయి. థియేటర్లలో వీడియోలు రికార్డ్ చేసి నెట్లో అప్లోడ్ చేయడం, డార్క్ వెబ్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా వేగంగా పంచడం వల్ల పైరసీ తలెత్తుతున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ఆడియన్స్ కు కొన్ని సూచనలు చేశారు. పైరసీ చేసేవారిని, పైరసీ కంటెంట్ను చూసేవారిని కూడా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ కేసు ఆధారంగా ఇతర నిందితులను గుర్తించే దిశగా దర్యాప్తు కొనసాగుతున్నట్టు సైబర్ క్రైమ్ అధికారులు వెల్లడించారు.
తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఈ అరెస్ట్ను స్వాగతించింది. పైరసీని కట్టడి చేయాలంటే ప్రభుత్వం, పోలీస్ శాఖ, సినీ సంస్థలు, ప్రేక్షకులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. పైరసీ వల్ల కలుగుతున్న నష్టంతో చిన్న, మధ్య తరహా నిర్మాతలు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.