- Home
- Sports
- Cricket
- Operation Sindoor: ఉగ్రవాదం ఆగేదాకా భారత్–పాకిస్థాన్ క్రికెట్కు బ్రేక్ వేయాలి: గౌతమ్ గంభీర్
Operation Sindoor: ఉగ్రవాదం ఆగేదాకా భారత్–పాకిస్థాన్ క్రికెట్కు బ్రేక్ వేయాలి: గౌతమ్ గంభీర్
Operation Sindoor: ఉగ్రదాడుల నేపథ్యంలో పాకిస్తాన్ తో ఏ ఫార్మాట్లోనూ క్రికెట్ ఆడొద్దని గంభీర్ సూచించారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Gautam Gambhir
ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్–పాకిస్థాన్ మధ్య క్రికెట్ సంబంధాలను పూర్తిగా నిలిపివేయాలని భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మంగళవారం డిమాండ్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఏ ICC టోర్నీ అయినా సరే, భారత్ పాక్ మ్యాచ్లు జరగకూడదని ఆయన స్పష్టం చేశారు.
"నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఉగ్రవాదం ఆగేంతవరకూ భారత్–పాకిస్థాన్ మధ్య ఏ మ్యాచ్ కూడా ఉండకూడదు. ఈ విషయం మీద నేను గతంలోనూ చెప్పాను," అని గంభీర్ అన్నారు.
2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ పట్టణంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు, మరణించారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఇందస్ వాటర్ ట్రిటీని నిలిపివేసింది, అటారి సరిహద్దును మూసివేసింది. పాక్తో డిప్లమాటిక్ సంబంధాలను తగ్గించింది.
Indian cricket team
ఈ నేపథ్యంలో భారత జట్టు కోచ్ గంభీర్ మాట్లాడుతూ, "భారత జవాన్లు, పౌరుల ప్రాణాలు సినిమా, సంగీతం, క్రికెట్ కంటే చాలా పెద్దవి. మ్యాచ్లు మళ్లీ జరుగుతాయి, సినిమాలు వస్తాయి. కానీ కుటుంబసభ్యుడిని కోల్పోయిన బాధ దేంతోనూ సరిపోలదు" అని వ్యాఖ్యానించారు.
India vs Pakistan Cricket match
ఈ ఏడాది ఆసియా కప్లో భారత్ పాకిస్థాన్ ఆడాలా? లేదా వచ్చే ఏడాది ఇండియా-శ్రీలంక వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్లో ఈ జట్ల మధ్య మ్యాచ్ ఉండాలా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, గంభీర్ ఇలా చెప్పారు: "ఇది నా నిర్ణయం కాదు. BCCI, ప్రభుత్వాలే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలి. వాళ్ల నిర్ణయాన్ని మనం గౌరవించాలి. దీనిని రాజకీయంగా వాడుకోవద్దు." అని అన్నారు.
Pakistan Cricket Team
ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో భద్రతా సమస్యల వల్ల భారత జట్టు పాకిస్థాన్లో కాకుండా దుబాయ్లోనే అన్ని మ్యాచులు ఆడింది. BCCI, పాక్ క్రికెట్ బోర్డు, ICC మధ్య ఒప్పందం ప్రకారం 2027 వరకు జరిగే టోర్నీల్లో ఇండియా–పాక్ మ్యాచ్లు న్యూట్రల్ వేదికలపై మాత్రమే జరుగుతాయి.
గంభీర్ చేసిన తాజా వ్యాఖ్యలు క్రికెట్ రాజకీయాలపై చర్చను మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి.