Chunni Turns Fatal: బైక్పై ఆస్పత్రికి తీసుకెళ్తున్న క్రమంలో చున్నీ వెనుక టైర్ లో పడి మెడకు చుట్టుకుపోవడంతో ఊపిరాడక ఒక మహిళా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Godavari district: ఆంధ్రప్రదేవ్ లోని తూర్పుగోదావరి జిల్లా కేసనకుర్రుకు చెందిన కళ్యాణపు రామదుర్గ (28) చున్నీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 9 నెలల క్రితం ఆమె మోహన్ కృష్ణ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ మధ్యే మోహన్కు విశాఖపట్నంలోని అచ్యుతాపురం సెజ్లో ఉద్యోగం రావడంతో, వారి కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
అయితే, కొత్త జీవితం ప్రారంభించి గుండె నిండా కలలు కని ముందుకెళ్తున్న దంపతుల జీవితాన్ని ఊహించని విషాదం ముంచెత్తింది. సోమవారం రాత్రి రామదుర్గ చెవి నొప్పితో బాధపడుతుండడంతో భర్త మోహన్ కృష్ణ ఆమెను బైక్పై ఆసుపత్రికి తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు.
ఆమె ధరించిన చున్నీ (దుపట్టా) బైక్ వెనుక టైర్లో చిక్కుకొని బలంగా లాగడంతో, అది రామదుర్గ మెడకు చుట్టేసి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఊపిరాడక తల్లడిల్లిపోయిన ఆమెను చూసిన స్థానికులు వెంటనే స్పందించి చున్నీని కత్తిరించారు. అయితే అప్పటికే ఆమె ఊపిరితీసుకోవడం కోసం ఇబ్బంది పడ్డారు.
వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే రామదుర్గ ప్రాణాలు కోల్పోయింది. 9 నెలల నవ వధువు మరణవార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. రామదుర్గ మృతితో భర్త మోహన్ కృష్ణ, తల్లిదండ్రులు ఊహించని విషాదంలో మునిగిపోయారు. వారి కన్నీటి రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి.
