తెలంగాణలో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న గ్రామ పంచాయితీలు, మండల పరిషత్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయా? అంటే అవుననే సమాధానమే ప్రభుత్వ వర్గాల నుండి వినిపిస్తోంది. ఇఫ్పటికే ఎన్నికల నిర్వహణకు ఆలస్యం కావడంతో త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తిచేసి గ్రామాల్లో పాలకవర్గాలను ఏర్పాటుచేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana Elections : తెలంగాణలో స్థానిక సంస్థలకు పాలకవర్గాలు లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుబడుతోంది. ఏడాదికాలంగా గ్రామ పంచాయితీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది... అధికారంలోకి వచ్చింది మొదలు రేపు మాపు అంటూనే ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది కాంగ్రెస్ సర్కార్. అయితే మరో రెండునెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలు, మండల పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్దమైందంటూ ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే తెలంగాణలో కులగణన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ డేటా ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ రిజర్వేషన్ల అంశం పెండింగ్ లో ఉండటంవల్లే ఎన్నికలు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్పష్టత రాగానే ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు సమాచారం. జూలైలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు దిశగా ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.
ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికలకు సిద్దమయ్యింది. బ్యాలెట్ బాక్సులను సమకూర్చుకుంది. ప్రభుత్వం నుండి ఆదేశాలు వెలువడగానే షెడ్యూల్ విడుదలచేసి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. జూన్ చివర్లో లేదంటే జూలై ఆరంభంలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు కొద్దిరోజుల వ్యవధిలోనే నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పంచాయితీ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించి కేవలం 15-20 రోజుల్లో ఈ ప్రాసెస్ ను పూర్తిచేయాలని... మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను కూడా ఇలాగే తక్కువ సమయంంలో పూర్తిచేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ఇలా ఒకే విడతలో ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను ఈసి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా ఓకే అయితే జూలైలో గ్రామాల్లో ఎన్నికల హడావిడి మొదలుకానుంది.
